జింఖానా మైదానం వద్ద అదుపులోకి వచ్చిన పరిస్థితి
భారత్, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ టికెట్ల కోసం భారీగా తరలివచ్చిన అభిమానులు
హైదరాబాద్: హైదరాబాద్లోని జింఖానా మైదానం వద్ద పరిస్థితి అదుపులోకి వచ్చింది. భారత్ ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సిరీస్ లో భాగంగా ఓ మ్యాచ్ నగరంలోని జింఖానా మైదానంలో జరగనుంది. ఈ మేరకు మ్యాచ్ ను దగ్గర నుంచి చూసేందుకు క్రికెట్ అభిమానులు జింఖానా గ్రౌండ్ కు టికెట్ల కోసం వచ్చారు.
అయితే టికెట్లు దొరక్క పోవడం, ఆన్ లైన్ సేవల్లో అంతరం ఏర్పడటంతో ఒక్కసారిగా భారీ ఎత్తున్న అభిమానులు ఆఫ్ లైన్ టికెట్ల కోసం జింఖానాకు చేరుకున్నారు. అయితే ఇక్కడ హెచ్సీఏ టికెట్ల నిమిత్తం ఒక్కటే కౌంటర్ పెట్టడంతో అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడి స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పారు. కాగా, టికెట్ల విక్రయాలు సజావుగా జరిగేలా అదనపు సీపీ చౌహాన్ చర్యలు చేపట్టారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) వ్యవహరిస్తున్న తీరుపై అభిమానులు గుర్రుగా ఉన్నారు. ఈనెల 25న మ్యాచ్ సమీపిస్తున్న వేళ ఆన్లైన్, ఆఫ్లైన్ అంటూ సాగదీసిన హెచ్సీఏ ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చింది. గురువారం నుంచి జింఖానా మైదానంలో ఉదయం 10 గంటల నుంచి టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని అధ్యక్షుడు అజారుద్దీన్ పేరిట ఒక ప్రకటన విడుదలైంది.
ఓవైపు మ్యాచ్కు సమయం దగ్గర పడుతుండటంతో విసిగిపోయిన అభిమానులు బుధవారం జింఖానా మైదానంలో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వేలాది మంది యువకులు హెచ్సీఏకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టికెట్ల విక్రయ వ్యవహారం పై క్రీడా శాఖ మంత్రి సమీక్ష నిర్వహించనున్నారు.
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox