ఫారెస్టు అధికారి అంత్యక్రియల్లో స్వల్ప ఉద్రిక్తత.. గుత్తికోయల దాడుల నుంచి రక్షించాలని మంత్రులకు అధికారుల విన్నపం

సానుకూలంగా స్పందించిన మంత్రులు

ఖమ్మం: గుత్తి కోయల దాడిలో ఫారెస్ట్ అధికారి శ్రీనివాస రావు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వలాంఛనాలతో ఫారెస్టు అధికారి శ్రీనివాస రావు అంత్యక్రియలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. అయితే ఆయన అంతిమయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ అటవీ సిబ్బంది అడ్డుకున్నారు. గుత్తికోయల దాడుల నుంచి రక్షించాలని, ఆందోళనకు దిగడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.

తమపై గుత్తికోయలు దాడులు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అటవీ అధికారులు, సిబ్బంది మంత్రులతో అన్నారు. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన గుత్తికోయలను రాష్ట్రం నుంచి పంపించేలా చర్యలు తీసుకోవాలని, అటవీశాఖ అధికారులకు ఆయుధాలు సమకూర్చాలని మంత్రులకు విన్నవించుకున్నారు. కాసేపు అక్కడ స్వల్ప ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

ఈ విషయం పట్ల సానుకూలంగా స్పందించిన మంత్రులు వారి సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళతామని హామీ ఇచ్చారు. ఆయుధాల అంశంపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మంత్రుల హామీతో ఫారెస్టు అధికారులు శాంతించారు. అనంతరం మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ శ్రీనివాస రావు పాడెను మోశారు.   

 

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox





మునుపటి వ్యాసం