పురుగుల మందు తాగి.. తన చావుకు కారణం ఎస్సై అన్న యువకుడు

మూడు లక్షలు లంచం తీసుకుని పలు కేసుల్లో ఇరికించాలని ఎస్సై చూస్తున్నాడని యువకుడి ఆరోపణ

జగిత్యాల: పురుగుల మందు తాగి.. తన చావుకు ఎస్‌ఐ కారణమని ఓ యువకుడు లేఖ రాసి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం... బల్వంతాపూర్ గ్రామంలో నక్క అనిల్ అనే యువకుడు పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిని సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడి భూమిని కొందరు కబ్జా చేయడంతో కేసు పోలీస్ స్టేషన్‌కి చేరింది.

దీంతో తన భూమి తనకి ఇప్పిస్తానని ఎస్‌ఐ చెప్పడంతో అతడికి అనిల్ మూడు లక్షల రూపాయలు సమర్పించుకున్నట్లు అనిల్ ఆరోపిస్తున్నాడు. కాగా, సదరు ఎస్‌ఐ కబ్జాదారులతో చేయి కలిపి తనని పలు కేసులలో ఇరికించాడని అనిల్ వాపోతున్నాడు. ఎస్‌ఐ లంచం తీసుకొని తనని మోసం చేయడంతో పాటు పలు కేసులు నమోదు చేయడంతో తాను ఆత్మహత్య చేసుకున్నానని లేఖ రాశాడు. డిజిపి, సిపికి లేఖ రాసి అనంతరం సోషల్ మీడియాలో పోస్టు చేసి తన పొలం దగ్గర అనిల్ పురుగుల మందు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.

రైతులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు మల్యాల ఎస్‌ఐ చిరంజీవిని మీడియా సంప్రదించగా అనిల్‌పై ఎనిమిది కేసులు ఉన్నాయని, అతడిపై రౌడీషీట్ తెరిచామని, కేసుల తొలగింపునకు తమపై ఒత్తిడి తీసుకువస్తున్నారని, అందుకే పురుగుల మందు తాగి ఉంటాడని ఎస్‌ఐ తెలిపాడు. తాను మూడు లక్షల రూపాయలు తీసుకున్నట్టు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని ఎస్సై మీడియాకు తెలిపాడు. 

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox





మునుపటి వ్యాసం