సహచర వైద్యుని వేధింపులను తాళలేక వైద్యురాలు ఆత్మహత్య

బెంగళూరులో ఆలస్యంగా వెలుగులోకి

బెంగళూరు: సహచర వైద్యుని వేధింపులను తాళలేక దంత వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన బెంగళూరులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా, మృతురాలు ఉత్తరప్రదేశ్‌ లక్నోకు చెందిన దంత వైద్యురాలు ప్రియాంశి త్రిపాఠి (28) మృతురాలిగా గుర్తించారు.

ప్రియాంశి ఓ ప్రముఖ ప్రైయివేటు ఆస్పత్రిలో దంతవైద్యురాలిగా పని చేస్తుండగా, అదే ఆస్పత్రిలో పనిచేసే సుమిత్‌ అనే వైద్యుడు ప్రేమ పేరుతో ఆమెను వేధించటం ప్రారంభించాడు. వేధింపులు మరింత ఎక్కువ కావడంతో  ప్రియాంశి తల్లిదండ్రులకు చెప్పి లక్నోకు తిరిగి వచ్చేస్తానని వేడుకొంది. దీంతో, ప్రియాంశి తల్లిదండ్రులు బెంగళూరుకు వచ్చి సుమిత్‌కు బుద్ధిమాటలు చెప్పారు.

తరువాత కూడా అతని తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి కొడుకు ప్రవర్తనను వివరించి తమ కూతుర్ని ఇబ్బందులకు గురిచేయవద్దని హెచ్చరించారు. ఇంత జరిగినా సుమిత్‌లో మార్పు రాలేదు. దీంతో విరక్తి కలిగిన ప్రియాంశి జనవరి 24న ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొంది. ప్రియాంశి తండ్రి సుశీల్‌ త్రిపాఠి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సుమిత్‌పై సంజయ్‌నగర పోలీసులు కేసు నమోదు చేశారు. 

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox