రైల్వే వ్యవస్థ మరింత బలోపేతానికి కృషి: అశ్వినీ వైష్ణవ్‌

ఐఆర్‌సీటీసీలో టికెట్ల జారీ మరింత వేగవంతం చేస్తామన్న రైల్వే మంత్రి

న్యూదిల్లీ: భారతీయ రైల్వే వ్యవస్థను మరింతగా బలోపేతం చేయనున్నట్టు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. శుక్రవారం ఆయన దిల్లిలో మీడియాతో మాట్లాడుతూ...   2023-24 ఆర్థిక సంవత్సరంలో 7వేల కి.మీల మేర కొత్త రైల్వే ట్రాక్‌ల నిర్మాణం చేపట్టనున్నాం. ప్రయాణికుల రిజర్వేషన్‌ సిస్టమ్‌ బ్యాకండ్‌లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం.

ప్రస్తుతం ఐఆర్‌సీటీసీలో రైలు టికెట్ల జారీ చేసే సామర్థ్యం నిమిషానికి దాదాపు 25వేలు ఉండగా దాన్ని 2.25 లక్షలకు అప్‌గ్రేడ్‌ చేస్తామన్నారు. అలాగే, ఎంక్వైరీల సామర్థ్యాన్ని 40 వేల నుంచి 4 లక్షలకు పెంచడమే లక్ష్యంగా నిర్దేశించుకుంటున్నట్టు తెలిపారు.

దేశవ్యాప్తంగా 2,000 రైల్వే స్టేషన్లలో 24 గంటల పాటు తెరిచి ఉండేలా ‘జన్ సువిధ’ కన్వీనియన్స్ షాప్‌లను నిర్మిస్తాం. 2022-23 ఏడాదిలో రోజుకు 12కి.మీ.ల చొప్పున మొత్తం 4,500 కి.మీల మేర రైల్వే ట్రాక్‌లు నిర్మించాలన్న లక్ష్యాన్ని అధిగమించాం. 2014కు ముందు ఇది రోజుకు 4 కి.మీలుగా మాత్రమే ఉండేది. వచ్చే ఏడాది 7,000 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే ట్రాక్‌లను ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది అని అశ్వినీ వైష్ణవ్‌  తెలిపారు. 

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox





మునుపటి వ్యాసం