CM KCR | నరేంద్ర మోదీకి ప్రైవేటైజేషన్ పిచ్చిపట్టింది.. : సీఎం కేసీఆర్
CM KCR | ప్రధాని నరేంద్ర మోదీకి ప్రైవేటైజేషన్ పిచ్చి పట్టుకుందంటూ సీఎం కేసీఆర్ విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు హాజరయ్యారు. ఎమ్మెల్యే హరిప్రియ నాయక్కు ఓటేసి గెలిపించాలని కోరారు.
CM KCR | ప్రధాని నరేంద్ర మోదీకి ప్రైవేటైజేషన్ పిచ్చి పట్టుకుందంటూ సీఎం కేసీఆర్ విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు హాజరయ్యారు. ఎమ్మెల్యే హరిప్రియ నాయక్కు ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘బీజేపీ పార్టీ, ప్రధాని నరేంద్ర మోదీకి ఓ పిచ్చిపట్టుకున్నది. ప్రైవేటైజేషన్ పిచ్చి. అన్ని ప్రైవేటు.. విమానాశ్రయం, ఓడరేవులు, రైళ్లు ప్రైవేటు. చివరకు దేశాన్ని ఏం చేస్తడో తెల్వదు. కరెంటు కూడా ప్రైవేటీకరణే. నన్ను కూడా బెదిరించారు. మీ రైతుల మోటార్లకు మీటర్లు పెట్టకపోతే సంవత్సరానికి రూ.5వేలకోట్ల బడ్జెట్ను కట్ చేస్తే.. ఐదేళ్లలో రూ.25వేలకోట్లు పోతయ్.. కానీ తలకాయ తెగిపడ్డా సరే మీటర్లు పెట్టా అని చెప్పిన. కారణం ఏంటంటే.. తెలంగాణ బతుకు ఏంటో నాకు తెలుసు’నన్నారు.
నేను వ్యవసాయం చేస్తున్నా..
‘నేను కూడా రైతునే. నేను కూడా ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నా. ఎన్ని బాధలున్నయో.. ఎన్ని బోర్లు వేసినమో.. ఎంత బోర్లపడ్డమో.. ఎన్ని అప్పుల పాలైనమో.. అవస్థలు పడ్డమో నాకు తెలుసు. రైతుల బాధలు నాకు తెలుసు. తెలంగాణ వచ్చిన నాడు వలసలు, కరెంటు లేదు. కరువు, మంచినీళ్లు, సాగునీరు లేదు. చెట్టుకొకరు గుట్టకొకరై బతుకపోయినం. గొడగొడ ఏడ్చినం ఆ రోజు. మనల్ని ఎవరూ పట్టించుకోలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్ల చక్కదిద్దాలి.. ఎలా మొదలు పెట్టాలి.. ఏ కార్యక్రమం ముందు తీసుకోవాలి.. మూడునాలుగు నెలలు మెదడు కరుగదీసి.. మేధావులను పిలిచి.. చర్చలు జరిపి ఒకదారి వేసుకున్నాం. ఈ మధ్యనే మొఖాలు తెల్లవడుతున్నయ్. పంటలు పండుతున్నయ్. అప్పులు తీరుతున్నయ్. ఒక రకమైన పద్ధతి పెట్టుకున్నాం. వ్యవసాయ స్థిరీకరణ జరగాలని రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంటు’ పెట్టుకున్నామన్నారు.
రైతుబంధు గురించి విన్నామా..?
‘బీఆర్ఎస్ రాకముందు రైతుబంధు గురించి విన్నమా? అప్పులుంటే తలుపులు తీసుకొని వెళ్లారే తప్ప రైతుకు రూపాయి ఇవ్వలేదు. రైతు సచ్చిపోతే కూడా ఆపద్బందు అనే దిక్కుమాలిన పథకం పెట్టారు. రూ.50వేలు ఇస్తామని చెప్పి ఆరు నెలలు రూ.10-20వేలు చేతులో పెట్టి పంపేది. పైరవీకారులే మేసేది. ఇవాళ రైతుబంధు పథకం పెట్టుకున్నాం. తద్వారా కొంత పెట్టుబడి సమయానికి వస్తున్నది. వ్యవసాయ స్థిరీకరణ జరగాలని రైతుల కోసం నాలుగైదు కార్యక్రమాలు చేశాం. దాంతో వ్యవసాయం నిలబడ్డది. రైతులు కొంచెం తేటపడ్డరు. గ్రామాలకు వాపస్ వచ్చారు. గతంలో పిల్లను ఇవ్వడానికి వస్తే.. అటెండర్ ఉద్యోగం ఉన్నా సరేగాని.. వ్యవసాయం చేస్తే పిల్లనివ్వమని వాపస్పోయేది. నిన్న ఇవాళ పద్ధతి మారి.. భూమి ఏమన్న ఉన్నదా అని అడుగుతున్నరు. భూమి ఉంటే పిల్లను ఇస్తున్నరు. ఇదంతా మీ కండ్లముందే జరిగిన చరిత్ర. రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంటు పెట్టుకున్నాం. నీటి తీరువా బకాయిలు రద్దు చేసుకున్నాం. రాష్ట్రంలో నీళ్లపై పన్ను లేదు’ అన్నారు.
courtesy:www.ntnews.com/telangana/cm-kcr-fires-on-pm-modi-privatization-at-yellandu-meeting-1317658
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox